
పేదలందరికీ ఇళ్లు మంజూరు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం
వర్షాలు వచ్చే లోపు ఇంటి నిర్మాణాలు జరగాలి: జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు
కర్నూలు , జూన్, 10, (SK1 NEWS HD) :
పేదలందరికీ ఇళ్లు నిర్మించాలన్నది ప్రభుత్వ లక్ష్యం అని జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు పేర్కొన్నారు. శుక్రవారం గూడూరు మండలం కేంద్రం సమీపంలో మరియు పులకుర్తి దారిలో ఉన్న జగనన్న కాలనీ లేఅవుట్ లలో చేపడుతున్న ఇళ్ళ నిర్మాణాల పురోగతిని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల కార్యక్రమంలో భాగంగా ఇళ్ల నిర్మాణం కోసం గుంతలు తీసిన వెంటనే రో.15 వేలు మంజూరు చేస్తున్నామని, ఇంటి నిర్మాణానికి అవసరమైన సిమెంట్, ఇసుక అందిస్తున్నామని, లబ్దిదారులు త్వరితగతిన ఇళ్లు నిర్మించుకోవాలని కలెక్టర్ సూచించారు . ఇసుక అవసరమున్న ప్రతి ఒక్క లబ్దిదారు కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇసుక అందేలా చర్యలు తీసుకోవాలని గృహ నిర్మాణ శాఖ డిఈని కలెక్టర్ ఆదేశించారు. వర్షాలు వచ్చేలోపు ఇళ్ల నిర్మాణం జరిగేలా ప్రణాళికా బద్ధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. లే అవుట్ లో విద్యుత్, నీటి సౌకర్యాలపై కలెక్టర్ ఆరా తీశారు. ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి కూడా స్వయం సహాయక సంఘాల్లో ఉన్న మహిళలకు ఎవరికైనా ఆర్థిక సహకారం కావాలంటే రుణ సదుపాయం అందిస్తామన్నారు. బిలో బేస్మెంట్ స్థాయిలో ఉన్న ఇళ్లను బేస్మెంట్ స్థాయికి తేవాలన్నారు. తమకు ఇల్లు మంజూరు చేయాలని రామాంజనేయులు అనే వ్యక్తి కోరగా ఇళ్లు మంజూరు కాని లబ్ధిదారులకు కూడా రెండవ దశలో ఇళ్లు మంజూరు చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ గారితో పాటు గృహ నిర్మాణ శాఖ డిఈ, ఎంపిడిఓలు, తదితరులు పాల్గొన్నారు.



