మైనారిటీసంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు

రాయల్ ఫంక్షన్ హాల్ లో ఘనంగా ఇఫ్తార్ విందు
మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు
ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి , జిల్లా కలెక్టర్ , జిల్లా ఎస్పీ , నగర ఎమ్మెల్యే, కర్నూలు ఎంపీ , నగర మేయర్, కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ , ముస్లిం మత పెద్దలు
కర్నూలు , ఏప్రిల్ 29, (SK1 NEWS HD) :
పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ముస్లింలకు ఘనంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది. శుక్రవారం సాయంత్రం నగరం లోని రాయల్ ఫంక్షన్ హాల్ లో జరిగిన ఇఫ్తార్ విందులో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, జిల్లా కలెక్టర్ పి . కోటేశ్వర రావు, జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి, నగర ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ , కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్, నగర మేయర్ బి. వై. రామయ్య, కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ భార్గవ్ తేజ్ తదితరులు పాల్గొన్నారు . ముస్లిం మత పెద్దలతో కలిసి తలపై టోపీ ధరించి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.

రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మాట్లాడుతూ : ముస్లిం మైనారిటీలకు ఎంతో పవిత్రమైన పండుగ రంజాన్ పండుగ .ప్రతి ఒక్కరూ పవిత్ర రంజాన్ మాసంలో రంజాన్ పవిత్రతను గుర్తించి అల్లా అనుసరించిన మార్గంలో నడవాలన్నారు.అందరం సోదర భావంతో మెలగాలనే సందేశాన్ని ఇఫ్తార్ విందు ద్వారా ఇవ్వబడుతోందన్నారు..

కర్నూలు ఎంపీ డా.సంజీవ్ కుమార్ మాట్లాడుతూ : మైనార్టీ సోదరులు ఈ మాసాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారన్నారు. అలాగే ముస్లిం సోదరులందరూ ఎంతో నిష్టగా ఉపవాసం ఉండి ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ అల్లా ఆశీస్సులు పొందాలన్నారు.

జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వర రావు మాట్లాడుతూ : క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే ‘ రంజాన్ మాసం అని, రంజాన్ సందర్భంగా అల్లాహ్ దీవెనలతో ప్రజలందరికీ సకల శుభాలు, సంతోషాలు కలగాలని, ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో ఉండాలని అన్నారు.

నగర ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ : క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతన, నియమ నిష్టలతో కఠిన ఉపవాస దీక్ష ల కలయికే పవిత్ర రంజాన్ పండుగ మాసం విశిష్టత అని వారు పేర్కొన్నారు. పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన ఈ మాసంలో ముస్లిం సోదరసోదరీమణులంతా నెలరోజుల పాటు కఠోర ఉపవాస దీక్షతో నిష్ఠగా అల్లాహ్ ను ఆరాధిస్తూ ఆధ్యాత్మిక జీవనం కొనసాగిస్తారని, అల్లాహ్ రక్షణ, కరుణ పొందాలనే లక్ష్యంతో రంజాన్ మాసంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తూ, బీద, ధనిక అన్న తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ ఉన్నదానిలో ఎంతోకొంత దానధర్మాలు చేస్తూ సేవా దృక్పథానికి, సహనానికి, సోదర భావానికి ప్రతీకగా రంజాన్ పండుగ అన్నారు.

నగర మేయర్ బి. వై.రామయ్య, జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి,కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ భార్గవ్ తేజ్ తదితరులు రంజాన్ మాసం విశిష్టత గురించి తెలియ చేస్తూ, ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రార్థనలు ముగిసిన అనంతరం ముస్లిం మత పెద్దలు, నాయకులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి మహబూబ్ బాషా, ఇతర అధికారులు పాల్గొన్నారు.



